ఫిబ్రవరి 22న రెండో విడత
3054 పోలియో బూత్ల ఏర్పాటు
కడప: దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈనెల 18వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ కెవి రమణ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పల్స్పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జిల్లాలో 3లక్షల 17వేల 452 మంది 0నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలియో చుక్కలు పిల్లలకు వేయడం జరుగుతుందన్నారు.
ఫిబ్రవరి నెల 22వ తేదీన రెండో విడత పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతుందన్నారు. 12వేల 68 మంది కార్యకర్తలు పల్స్పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగస్వాములు అవుతారన్నారు. మురికివాడల నివాసాల్లోని కుటుంబాల ప్రాంతాల్లో, రైల్వేస్టేషన్లు , బస్టాండులు పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గోపవరం, ఒంటిమిట్ట, నందలూరుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. అలాగే 19,20వ తేదీల్లో కూడా మిగిలిన పిల్లలకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు.
జిల్లా వైద్య శాఖాధికారి నారాయణ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో 2003 సంవత్సరం నుంచి ఎలాంటి పోలియో కేసులు నమోదుకాలేదన్నారు. మనదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియో రహిత దేశంగా ప్రకటించిందన్నారు. మన సమీప దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నైజీరాయాల్లో ఇప్పటికే పోలియో ఉన్నట్లు గుర్తించడం వల్ల మనదేశానికి ప్రాకే అవకాశం ఉన్నందువల్ల ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దేశమంతా పోలియో చుక్కలు వేయడం జరుగుతోందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 3వేల 54 పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగరాజు జిల్లాలో నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమంపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు.
కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ సిద్దప్ప గౌరవ్, అడిషనల్ డిఎంహెచ్ఓ అరుణాసులోచన, డిఆర్డిఏ పిడి అనిల్కుమార్రెడ్డి, జెడ్పి సిఇఓ మాల్యాద్రి, డిపిఓ అపూర్వసుందరి, డిఇఓ ప్రతాప్రెడ్డి, పిహెచ్సి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు