ఓట్లు, సీట్లు ప్రాతిపదికన జిల్లాకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం
వైకాపాను ఆదరించారనే అధికారపక్షం కక్ష కట్టింది
కోస్తా వాళ్ళ ప్రాపకం కోసమే విపక్ష నేత మౌనం
కడప : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనకు జెండాలను పక్కనబెట్టి అన్ని రాజకీయ పక్షాలు కలిసి పోరాడాలని అఖిలపక్షం పిలుపునిచ్చింది. సోమవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ‘కడప ఉక్కు- రాయలసీమ హక్కు, ఉక్కు పరిశ్రమను తరలించడం అడ్డుకుందాం’ అనే అంశంపై ఆ పార్టీ రాష్ట్ర నేత బి నారాయణ అధ్యక్షతన సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నగర మేయర్ సురేష్బాబు మాట్లాడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరముందన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కుపరిశ్రమ నిర్మాణానికి వామపక్షాల నాయకత్వాన ఏ ఆందోళనకు పిలుపు ఇచ్చినా మద్దతుగా వైకాపా శ్రేణులు ముందుకు సాగుతాయన్నారు. 1970లో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో పరిశ్రమ సాధించడానికి ప్రాణత్యాగాలు చేశారనీ అందులో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారన్నారు. ఆ స్థాయి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిందన్నారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీమను విస్మరించి కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. పోరాటం చేయకపోతే ఉక్కు పరిశ్రమ వచ్చే అవకాశాలు లేవన్నారు.
వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులతో కలిసి పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
కడప శాసనసభ్యుడు అంజద్బాషా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్రెడ్డి చనిపోయిన తరువాత జిల్లాలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అటకెక్కాయన్నారు.
రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఓట్లు, సీట్లు ప్రాతిపదికన రాయలసీమ, కడప జిల్లాకు తెదేపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఉక్కు పరిశ్రమను సాధించుకోలేకపోతే ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు వ్యర్థమని పేర్కొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యాలయాలను ఉద్యమ నిలయాలుగా మార్చాలని, నేతలు పార్టీల జెండాలను పక్కనబెట్టి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు.
సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ వైకాపాకు ఓట్లు వేశారన్న కారణంగా తెదేపా ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం ఆరోపించారు. కోస్తా ప్రాంతంలో ఓట్లు పోతాయనే భయంతో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి కూడా జిల్లా అభివృద్ధిపై మాట్లాడకపోవడం దారుణమన్నారు.
బార్అసోసియేషన్ అధ్యక్షులు రాఘవరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు సాజిద్హుస్సేన్, ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్రెడ్డి, ఆర్ఎస్ఎఫ్ నాయకులు భాస్కర్, జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు మస్తాన్వలి, మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ప్రసంగించారు.
కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు లింగమూర్తి, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు చంద్ర, రైతుసంఘం నాయకుడు చంద్రమౌళీశ్వర్రెడ్డి, ఆమ్ ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు మస్తాన్వలి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్, సీపీఎం నగర నాయకుడు దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.