పుట్టపర్తి తొలిపలుకు
కీ.శే.పుట్టపర్తి నారాయణాచార్యులు

ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా ఉపన్యాసం. ఒక వేయిన్నూట పదహార్లిచ్చి సత్కరించినారు. ఆ సందర్భంలో శ్రీ ధన్ గారు నాకు పరిచయమైనారు. ఆయన సాహితీ ప్రేమికుడు. జీవితంలో కష్టసుఖముల నెరిగినవాడు. నన్నుగూర్చి వారికంతకు ముందే తెలుసు. వారు కొన్నివేలు ఖర్చుపెట్టి మంచి బొమ్మలతోపాటు శివతాండవాన్ని మరలా ముద్రించి యిస్తానని పూనుకొన్నారు. వారి యౌదార్యాన్ని నేనెట్లు గౌరవించవలెనో నాకు తెలియదు. చిరంజీవి రామమోహనరాయ్, మరికొందరు వారి ప్రయత్నానికి హర్షించి వారికి తోడైనారు. వీరందరికిన్నీగూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెల్పుకోవడం తప్ప మరేమీ చేయలేను.

చదవండి :  శ్రీభాగ్ ఒప్పందం లేదా ఒడంబడిక

శ్రీశ్రీగారి ‘ మహాప్రస్థానం ‘ లాగా ‘శివతాండవా’న్ని ముద్రించి పెద్ద వెలపెట్టి నా కార్ధికంగా యేదైనా ఉపయోగపడేటట్టు చూడాలని శ్రీ ధన్ గారు సంకల్పించారు. ఋణానుబంధాలు మహా విచిత్రంగా వుంటాయి. భౌతికాలైనా కారణాలతో వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం నా యోగ్యతకు మించినపని.

నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో విన్పించడం జరిగింది. విన్పించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలేతప్ప, మరేమీ వినలేదు. ఇతర భాషలవారు కూడా తెనుగురానివారు కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకొనేవారు. తిరువాన్కూరులో వున్నప్పుడు ఢిల్లీలో వున్నప్పుడు కూడా దీన్నిగూర్చిన పొగడ్తలే. ఆ కావ్యంలో అనుభూతంగావచ్చే ‘లయ’ వాళ్ళ నంతగా ఆకర్షించి వుంటుందను కున్నాను. దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వర స్వామికి చాలా నియమంగా ప్రదక్షిణాలు చేసేవాడిని. రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. అప్పుడు వ్రాసినదీ కావ్యం. కావ్యం చాలా చిన్నగా వుందని, కొద్దిగా పెంచుదామని ఎంతెంతో ప్రయత్నించినాను. కానీ నాకు సాధ్యం కాలేదు. భగవదిచ్చ యింతేనేమో అనుకున్నాను.

చదవండి :  కడపలో ఏర్పాటు కావాల్సిన ఉక్కు కర్మాగారం తరలించేందుకు కుట్ర

ఈ కావ్యంలో సంగీత, నాట్య సాహిత్య సంకేతాలు పెనవేసుకొనివున్నాయి. ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకుకొంత తెలిస్తేగానీ, ఈ కావ్యం అర్థంగాదు. దీనిపైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బాగుంటుందని చాలామంది నాకు సూచించినారు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం. ఆ పని ఎప్పుడూ చేయలేదు.

అంతమాత్రమేకాదు. ఈ కాలంలో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింటుకావడం ఒక కష్టం. ఎవ్వడో పబ్లిషరు వేటగానివలె కాచుకొనివుంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్య నేరం చేసినవాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి. ఈ బాధలు ప్రతీ రచయితా అనుభవిస్తున్నవే.

నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యమూ, పద్యము రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరూ శివతాండవ గ్రంథమూ పెనవేసుకొని పోయినవి. ఇదికూడా ఒక భగవత్ చిత్రమే. ఈ గ్రంథం ఇతర భాషల్లోకూడా పరివర్తితమయింది. జర్మన్ లోకి ఎవ్వరో చేసినారు. హిందీలోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు. నేను వానిని చూచినానుకూడా. ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం చాలా కష్టం. ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దంపైన ఆధార పడుతుంది. ఇంగ్లీషులోకి తెద్దామని నేనే ఎన్నోసార్లు ప్రయత్నించినాను. కానీ ఆ భాషాంతరీకరణం ఎప్పుడు నాకు తృప్తినిచ్చింది లేదు. కాళిదాసు ఎన్నో గ్రంథాలు వ్రాసినాడు. ఆయన మేఘసందేశానికెందుకో గొప్ప అదృష్టం పట్టింది. విశ్వనాధవారు ఎక్కడ పోయినా కిన్నెరసాని పాటల్నే చదవమనేవారు.

చదవండి :  'రాయలసీమవారి అభిప్రాయానికి ఇప్పటికైనా కట్టుబడాలి' - ఎబికె ప్రసాద్

శ్రీ బాపుగారు ప్రసిద్ధ చిత్రకారులు. వారికెన్నో పనులు. బహుకార్యవిష్టులైన్నీ నాపై దయతో చిత్రాలని గీచి యిచ్చినారు. వారికి నా మనఃపూర్వకమైన కృతాంజలి. ఇంకొకసారి శ్రీ ధన్ గారికి, తక్కిన మిత్రులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పుట్టపర్తి నారాయణాచార్య

నవంబర్, 1985

(శివతాండవం  తొలిపలుకు నుంచి)

ఇదీ చదవండి!

శివతాండవం

ఊహాతీతం – ఈ ఆనందం

సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి వారి శివతాండవం పై వ్యాఖ్య శివరాత్రి వచ్చిందంటే చాలు ఆ చిదానందరూపుడి వైభవాన్ని తలుచుకుంటూ ఉంటాం. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: