బద్వేలు: వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం పాలకులు రాజకీయ కుట్రలతోనే జిల్లాకు నిధులను నిలిపివేశారని సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలతోనే జిల్లా అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన నేతలు ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బద్వేలులో నిర్వహించిన ఆ పార్టీ 8వ జిల్లా మహాసభలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిశంకర్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… కరువు రైతులను ఆదుకునేందుకు రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి రూ.10వేల చొప్పున పంటనష్టం అందజేయాలని కోరారు.
జిల్లాలోని గండికోట, తెలుగుగంగతో పాటు పలు ప్రాజెక్టులు నిధులు లేక పూర్తి కాలేదన్నారు. కొన్ని జిల్లాల్లో రేషన్కార్డుల కూపన్లు ఇచ్చారనీ, వైఎస్ఆర్ జిల్లాలో మాత్రం అవి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఉపాధి హామీలో అన్ని జిల్లాల్లో కంటే కడపే వెనుకబడి ఉందన్నారు. స్థానిక రిమ్స్లో సరిపడా డాక్టర్లు లేరని, మందులు కూడా లేవని ఆరోపించారు. సమస్యల పరి ష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని తమ పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు పార్టీ కార్యకర్తల తోపాటు పేదలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
జిల్లా కార్యదర్శిగా మళ్లీ నారాయణ ఎన్నిక
సీపీఎం జిల్లా కార్యదర్శిగా బి.నారాయణ తిరిగి ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శివర్గ సభ్యులుగా బి.నారాయణ, రవిశంకర్రెడ్డి, ఆంజనేయులు, సీ.బాబు, రఘు, చంద్రశేఖర్లను ఎన్నికయ్యారు. అలాగే వీరితో పాటు 18 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు