పదోతరగతిలో మనోళ్ళు అల్లాడిచ్చినారు

98.54 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రధమ స్థానం

484 మందికి పదికి పది జిపిఏ

కడప : మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వచ్చిన కడప జిల్లా.. ఈ ఏడు పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 98.54 శాతం ఉత్తీర్ణత సాధించి కడప జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపినారు.  జిల్లా వ్యాప్తంగా 35,366 మంది పరీక్షలకు హాజరవ్వగా 34,848 మంది ఉత్తీర్ణులయ్యారు. దాంతో 98.54 శాతంతో జిల్లా ప్రథమ స్థానానికి చేరుకుంది. బాలుర విభాగంలో 17399 మందికి గాను 17733 మంది ఉత్తీర్ణులై 98.54 శాతం ఫలితాలు సాధించారు.

చదవండి :  పదోతరగతి ఫలితాల్లో కడప జిల్లాదే అగ్రస్థానం

బాలికల విభాగంలో 17,367 మందికి గాను 17,115 మంది ఉత్తీర్ణత సాధించి 98.55 శాతం ఫలితాలతో బాలుర కంటే ఒకమెట్టు పైన నిలిచారు. మంచి ఫలితాలు సాధించడంతో విద్యా శాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

పదవ తరగతి ఫలితాలల్లో వైఎస్సార్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రథమ, చివర స్థానాలు రాయలసీమకే దక్కాయి. వైఎస్సార్ జిల్లా 98.54 శాతం సాధించగా, అనంతపురం జిల్లా 93.11 శాతం, కర్నూలు జిల్లా 90.97 శాతం ఉత్తీర్ణత సాధించాయి. చిత్తూరు జిల్లా 71.29 శాతం ఫలితాలతో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ సైతం 100 శాతం ఫలితాలు సాధించి అటు క్రీడలు, ఇటు చదువులోనూ తిరుగులేదని చాటి చెప్పింది.

చదవండి :  వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులకు పతకాల పంట

484 మందికి 10కి 10

జిల్లా విద్యార్థులు 484 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం 10కి 10 పాయింట్లు సాధించి సత్తాచాటారు. గత ఏడాది 87 మంది విద్యార్థులు మాత్రమే 10కి 10 పాయింట్లు సాధించారు. ఈమారు ఏకంగా 5 రెట్లు అధికంగా 484 మంది 10కి 10 పాయింట్లు సాధించడం విశేషం.

18 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 18 నుంచి జూలై 1వ తేదీ వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు జూన్ 2వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న ప్రధానోపాధ్యాయులు ఫీజును ట్రెజరీలో చెల్లించి 6న డీఈఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం జూన్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి :  గంగమ్మను దర్శించుకున్న నేతలు

ఇంటర్మీడియట్ ఫలితాలలో కడప జిల్లా చివరి స్థానంలో ఉన్నందుకు విచారించాల్సినా.. పది ఫలితాలలో మొదటి స్థానంలో నిలవటం జిల్లా వాసులనదరికీ సంతోషం కలిగించే విషయమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: